*కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు వారి స్వగ్రామంలో నివసిస్తారు. వారి బిడ్డలు ఉద్యోగ నిమిత్తమో, చదువు నిమిత్తమో పట్టణాలలో ఉంటుంటారు. అటువంటి సందర్భాలలో తల్లిదండ్రులను ఏదైనా అవసరములో ఉన్నా, ఆనారోగ్యంతో బాధపడుతున్నా, పిల్లలను చూడాలనే బెంగతో వారిని బిడ్డలు ఖచ్చితంగా దర్శించాలి.*
*‘‘ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా యెడల నీకు కటాక్షమున్న యెడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తుతో పాతిపెట్టకుము.’’ (ఆది47:29).*
*యాకోబు వయస్సు పైబడినప్పుడు తన మరణ దినం సమీపంగా ఉందని తెలుసుకొని యోసేపుకు కబురు పంపాడు. ఆ సమయంలో యేసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా తీరిక లేనటువంటి బాధ్యతలు కలిగివున్నప్పటికీ తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే యేసేపు తన కుమారులను వెంటబెట్టుకొని యాకోబు దగ్గరికి వెళ్ళాడు.*
*ఆనాడు యేసేపు నాకు తీరక లేదు, తర్వాత వస్తాను అని చెప్పలేదు. వెంటనే బయలుదేరాడు. మీ తల్లిదండ్రులు కూడా నీకు దూరంగా ఉంటున్నప్పుడు, వారు నిన్ను చూడాలని ఆశించినా, వారి ఆరోగ్యం బాగాలేకపోయినా ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వారిని కలవాలి. నీకు నీ తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో నీ భార్యకు తన తల్లిదండ్రులు కూడా అంతే ముఖ్యం కాబట్టి నీ భార్య ఒకవేళ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు తనను ఆటంకపరచకూడదు. నీ భార్యను ఖచ్చితంగా తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించాలి. అవసరమైతే నీ బిడ్డలను కూడా నీ తల్లిదండ్రుల దగ్గరకు, నీ భార్య తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలి. తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారికి సంతోషాన్ని పంచాల్సిన బాధ్యత బిడ్డలుగా మనందరిపైన ఉంది.*
*‘‘ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా (ఆది 48:1) సాధారణంగా తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వారి వృద్దాప్యంలో మనవళ్ళను, మనవరాళ్ళను చూడాలని, వారితో సమయం గడపాలి ఆశపడుతుంటారు. ప్రేమానురాగాలు తెలిసిన యేసేపు వృద్దాప్యంలో ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్ళేటప్పుడు తన కుమారులను కూడా తీసుకొని వెళ్తే వారిని చూసి తన తండ్రి సంతోషిస్తాడని తలంచి తన ఇద్దరు కుమారులను కూడా తీసుకొని వెళ్ళాడు. యాకోబు తనను పరామర్శించడానికి యేసేపు వస్తున్నాడని తెలియగానే బలము తెచ్చుకకుని కూర్చున్నాడని వాక్యం సెలవిస్తుంది. ‘‘ఇదిగో నీ కుమారుడైన యేసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను.’’ (ఆది 48:2), ఆనాడు కుమారుడు వస్తున్నాడనే వార్త తండ్రికి బలానిచ్చింది.*
*యోసేపును, యేసేపు కుమారులను చూసిన యాకోబు తన మనవళ్ళను దగ్గరకు తీసుకుని 12 మంది కలిగిన ఇశ్రాయేలు గోత్రంలో వీరిద్దరు కూడా చేర్చబడతారు అని వాగ్దానం చేసి ఆ ఇద్దరు కుమారులను దీవించాడు. అప్పుడు యేసేపు యొక్క కుమారులు యాకోబు కుమారులలో చేర్చబడ్డారు. యేసేపు యొక్క మంచితనము, తండ్రి పట్ల తనకున్న ప్రేమ, బాధ్యత, తండ్రిపట్ల తాను చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ తన ఇద్దరు కుమారులను దేవుడు వాగ్ధానం చేసిన ఇశ్రాయేలు గోత్రములలో ఒకరిగా చేర్చింది. దేవుడు మనం విత్తిన విత్తనాలకు తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. కనుక వృద్దాప్యమందున్న తల్లిదండ్రులను మనం సంతోషపరచాలి.*
*నేడు ప్రతి ఒక్కరూ యేసేపు వలె వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను నిర్వర్తిస్తే దేవుడు తప్పక వారిని ఆశీర్వదిస్తాడు. నువ్వు మానవత్వం కలిగిన వ్యక్తివైతే నీ తల్లిని, నీ తండ్రిని, నీ అత్తను, నీ మామను ప్రేమించడం, గౌరవించడం నేర్చుకో, నువ్వు నీ బిడ్డలు, వారి బిడ్డలు చక్కటి ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు అవుతారు*